టీమిండియా మాజీ క్రికెటర్, భారత క్రికెట్ కు సుమారు రెండు దశాబ్దాల పాటు సేవలందించిన మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘శభాష్ మిథు’ ట్రైలర్ విడుదలైంది. సోమవారం ఉదయం చిత్ర బృందం ఈ ట్రైలర్ ను విడుదల చేసింది. 2.44 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ను మిథాలీ రాజ్.. తన సామాజిక మాధ్యమ ఖాతాలలో అభిమానులతో పంచుకుంది.
వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మాణంలో శ్రీజిత్ ముఖర్జీ దర్శకుడిగా బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మిథాలీ రాజ్ గా ప్రముఖ నటి తాప్సీ పన్ను నటిస్తున్నది. ‘మెన్ ఇన్ బ్లూ మాదిరిగానే మనకు కూడా ఉమెన్ ఇన్ బ్లూ అనే ఓ జట్టు ఉంటే బాగుంటుందని నేను ఎనిమిదేండ్ల నుంచి కలలు కంటున్నాను..’ అని తాప్సీ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది.
ఈ సినిమాలో మిథాలీ చిన్ననాటి నుంచి క్రికెటర్ కావాలని పడిన ఆరాటం.. క్రికెటర్ గా ఎదిగే క్రమంలో ఆమె ఎదుర్కున్న అవమానాలు, ఆటలో ఆమె చూసిన ఎత్తుపల్లాలు.. భారత మహిళా క్రికెట్ కు గుర్తింపు తీసుకురావడం కోసం ఆమె చూపిన తెగువను చూపించారు. ట్రైలర్ చూశాక ఇదే విషయం స్పష్టమవుతున్నది. ఇక ట్రైలర్ ను అభిమానులతో పంచుకుంటూ మిథాలీ.. ‘ఒక ఆట.. ఒక దేశం.. ఒక ఆశయం.. నా కల! ఈ టీమ్ కు కృతజ్ఞతలు. నా కథను మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది..’ అని రాసుకొచ్చింది.
మిథాలీగా తాప్సీ అదరగొట్టింది. కొన్ని సందర్భాల్లో అయితే తాప్సీ అచ్చం మిథాలీని దింపేసింది. పలు సన్నివేశాల్లో ఆమె చూపిన నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. జులై 15 న ఈ సినిమా విడుదల కానుంది.