రివ్యూ – మిషన్ ఇంపాసిబుల్
నటీనటులు: తాప్సీ పన్ను, హర్ష్ రోషన్, భాను ప్రకాష్, జయతీర్థ మొలుగు, హరీష్ పెరడి, రవీంద్ర విజయ్ తదితరులు
సాంకేతిక నిపుణులు: ఎడిటర్ – రవితేజ గిరిజాల, సంగీతం – మార్క్ కె రాబిన్, సినిమాటోగ్రఫీ – దీపక్ యరగర, నిర్మాతలు – అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, రచన దర్శకత్వం – స్వరూప్ ఆర్ఎస్ జే
కథేంటంటే:
తన కూతురు అపహరణకు గురైన కేసులో ఇన్వెస్టిగేషన్ కోసం విక్రమ్ (రవీంద్ర విజయ్) జర్నలిస్ట్ శైలజ (తాప్సీ పన్ను) సహాయం కోరతాడు. కిడ్నాప్ అయ్యాక తన కూతురును ఎన్ని హింసలు పెట్టారో చెప్పాక శైలజ కూడా అతనికి సాయం చేసేందుకు సిద్ధమవుతుంది. వీళ్లకు ఎస్ ఐ సతీష్ తోడవుతాడు. పిల్లల కిడ్నాపింగ్ ముఠాను నడిపిస్తున్న మంత్రి కృష్ణ వడియార్ ను ఓ చిన్న పిల్లాడితోనే హత్య చేయిస్తుంది శైలజ. పిల్లలను దుబాయ్ కు అక్రమ రవాణా చేస్తున్న రామ్ శెట్టి (హరీష్ పెరడి) ఆట కట్టించడాన్ని తర్వాత మిషన్ గా పెట్టుకుంటారు శైలజ, విక్రమ్, సతీష్. ఇదిలా ఉంటే తిరుపతి దగ్గర వడమాలపేట గ్రామంలో ఉండే ముగ్గురు పిల్లలు రఘుపతి, రాఘవ, రాజారాం చురుకైన వారు. వాళ్ల ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. బాగా డబ్బు సంపాదిస్తేనే తాము అనుకున్నది సాధించగలం అనుకున్న ఈ ముగ్గురు అందుకు దావూద్ ఇబ్రహీంను కిడ్నాప్ చేసి పోలీసులకు అప్పగించాలనుకుంటారు. అటు శైలజ బృందం టార్గెట్, ఇటు ముగ్గురు పిల్లల మిషన్ ఒక సందర్భంలో కలుస్తుంది. క్రూరమైన నేరస్తుడు రామ్ శెట్టి బారి నుంచి పిల్లలను శైలజ కాపాడగలిగిందా, ముగ్గురు పిల్లలు దావూద్ ఇబ్రహీంను పోలీసులకు పట్టించారా లేదా అనేది తెరపై చూడాలి..
ఫ్లస్ పాయింట్స్:
తాప్సీ నటన
ముగ్గురు పిల్లల పర్మార్మెన్స్
నవ్వించే సంభాషణలు
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్:
నెమ్మదించిన సెకండాఫ్
ఎలా ఉందంటే:
పిల్లల అక్రమ రవాణా అంశాన్ని నేపథ్యంగా ఎంచుకుని ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్ జే. ముగ్గురు పిల్లల సాహసోపేత ఆలోచనలు, వాళ్ల అమాయకత్వం, ప్రదర్శించే ధైర్యం…వీటన్నింటినీ కలిపి సినిమాలో వినోదాన్ని పండించే ప్రయత్నం చేశారు దర్శకుడు. వీళ్ల సరదా మాటలు, చేష్టలతోనే తొలి భాగం సినిమా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. మరోవైపు నేరస్తుల ఆట కట్టించేందుకు తాప్సీ, రవీంద్ర విజయ్ బృందం చేసే ఇన్వెస్టిగేషన్, వేసే ప్లాన్ లు ఆసక్తి కలిగిస్తాయి. ఈ రెండు బృందాలు కలిసే చోట ఒక ఆసక్తికర మలుపుతో సినిమా తొలి అర్థభాగం ముగుస్తుంది. ద్వితీయార్థంలో దీనికి కొనసాగింపుగా అనేక ట్విస్టులతో కథను క్లైమాక్స్ దాకా తీసుకెళ్లారు. జర్నలిస్ట్ శైలజ పాత్రలో తాప్సీ నటన ఆకట్టుకుంటుంది. పిల్లల్ని కాపాడేందుకు ప్రయత్నించే యువతిగా ఆమె మెప్పించింది. కూతురు కోసం, అలాంటి మిగతా పిల్లల కోసం మిషన్ లో పాల్గొనే విక్రమ్ క్యారెక్టర్ లో రవీంద్ర విజయ్ సహజంగా కనిపించారు. ముగ్గురు పిల్లలు రఘుపతి, రాఘవ, రాజారాం పాత్రల్లా మారిపోయారు. ఈ పాత్రల్లో వీళ్లు ప్రదర్శించిన నటన, చెప్పిన డైలాగ్స్ నవ్వులు పూయించాయి.
మార్క్ కె రాబిన్ సంగీతం సినిమాకు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఏద్దా గాలం, చేసేద్దాం గందరగోళం ఆకట్టుకుంది. నేపథ్య సంగీతం కూడా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. సినిమాలో ప్రేక్షకులను ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. సినిమాటోగ్రఫీ బ్రైట్ గా, ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉన్నాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా తర్వాత దాదాపు అలాంటి కథనే ఎంచుకున్న దర్శకుడు స్వరూప్…రెండో చిత్రానికీ పూర్తి బాధ్యతగా, జాగ్రత్తగా సినిమాను తెరకెక్కించారు. గత చిత్రం తాలుకూ ఛాయలు కనిపించినా, పిల్లల అక్రమ రవాణా అంశం కాబట్టి ప్రేక్షకులకు సినిమా మీద సింపథీ కలుగుతుంది. అదే సమయంలో పిల్లలతో తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు మనసును ఇబ్బంది పెడతాయి. తొలి భాగం పిల్లల అల్లరితో సరదాగా సాగినా సెకండాఫ్ నెమ్మదించింది. ద్వితీయార్థాన్ని ఇంకాస్త బెటర్ గా చేసి ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేది.
చివరగా…మిషన్ ఇంప్రెసివ్
రేటింగ్ : 2.75/5