Music school | శ్రియా శరణ్, శర్మన్ జోషి, ప్రకాష్రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. పాపారావు బియ్యాల దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ భాషల్లో యామిని ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ఇళయరాజా సంగీతాన్నందించారు. ఈ నెల 12న విడుదలకానుంది. తెలుగులో దిల్రాజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. శనివారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పాపారావుగారు నాకు అత్యంత ఆప్తులు. గత పదహారేండ్లుగా నాకు ఆయనతో సాన్నిహిత్యం ఉంది. తెలంగాణ ఉద్యమంలో పాపారావుగారు తెరవెనక ఉండి కీలక భూమిక పోషించారు. ఢిల్లీలో వ్యవహారాల్ని చక్కదిద్దారు. ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత ఐదేండ్లు తెలంగాణ ఫ్రభుత్వానికి సలహాదారుడిగా పనిచేశారు. ఆయన సినిమా తీశానని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. పాటలు విన్నప్పుడు అద్భుతంగా అనిపించాయి. ఈ రోజు ఇళయారాజా గారితో ఈ వేదిక పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఓ మ్యూజిక్ యూనివర్సిటీ పక్కన నిల్చునే అవకాశం నాకు దక్కినట్లుగా భావిస్తున్నా. మన పిల్లలకు సైన్స్, ఇంజినీరింగ్, మ్యాథ్స్ గురించి చెబుతూ వాళ్లలో ఉండే సృజనాత్మక ప్రతిభను చంపేస్తున్నామని..ఇదే అంశాన్ని ఈ సినిమాలో చూపించానని పాపారావుగారు నాతో చెప్పారు.
దేశం ప్రగతిపథంలో ముందుకు సాగాలంటే సైన్స్, టెక్నాలజీతో పాటు క్రియేటివ్ ఫీల్డ్లో కూడా ఎదగాలి. నా కుమారుడు హిమాన్షు మూడు నెలల క్రితం ‘గోల్డెన్ అవర్’ అనే పేరుతో ఓ కవర్ సాంగ్ పాడాడు. అతని గాత్రం, ప్రతిభ చూసి నాకే ఆశ్చర్యమేసింది. ఎలాంటి శిక్షణ లేకుండానే చక్కగా పాడాడు. అలా ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా ప్రత్యేకమైన ప్రతిభ దాగి ఉంటుంది. అంకితభావంతో సాధన చేస్తే అదే గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి మార్గదర్శనం చేయమని ఈ వేదిక మీది నుంచి ఇళయరాజాగారిని అభ్యర్థిస్తున్నా. ఆయన అంగీకరిస్తే అది మాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తా. ‘మ్యూజిక్ స్కూల్’ సినిమాను అందరూ సక్సెస్ చేయాలని, పాపారావుగారు మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నా’ అన్నారు.
చిత్ర దర్శకుడు పాపారావు బియ్యాల మాట్లాడుతూ ‘సినీ రంగం నాకు చాలా కొత్త. ఒక ఐఏఎస్గా సర్వీస్ చేసి ఇలా ఫిల్మ్ వరల్డ్లోకి ఎలా వచ్చానని నాకే కాస్త అనుమానంగా ఉంటుంది. రమేష్ ప్రసాద్గారు నన్ను ఇళయరాజాగారి దగ్గరికి తీసుకెళ్లారు. ఇరవై ఏండ్ల క్రితం నేను తీసిన డాక్యుమెంటరీని రమేష్ప్రసాద్గారు చూసి నేషనల్ అవార్డ్ వస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఆ షార్ట్ ఫిల్మ్కు జాతీయ అవార్డు వచ్చింది. ఈ సినిమాలో 11 పాటలుంటాయని ఇళయరాజాగారితో చెప్పగానే ఆయన వెంటనే చేద్దామన్నారు. ఈ సినిమా విషయంలో ఆయనే నాకు ధైర్యాన్నిచ్చారు. సినిమా చూసి బుడాపెస్ట్ ఆర్కెస్ట్రాతో బ్యాక్గ్రౌండ్ చేద్దామన్నారు. ఇద్దరం కలిసి బుడాపెస్ట్ వెళ్లాం’ అని చెప్పారు.
ఇళయరాజా మాట్లాడుతూ ‘ఎక్కడైతే సంగీత సాధన ఉంటుందో అక్కడ హింసకు తావు ఉండదు. మోసాలు జరగవు. ప్రజలకు కావాల్సింది దొరుకుతుంది. కుటుంబంలో ప్రేమ దొరుకుతుంది. మ్యూజిక్ నేర్చుకుంటే లక్ష్మీ, సరస్వతి మన వెంట ఉన్నట్టే. 200 ఏళ్లయినా ప్రపంచం ఇప్పటివరకు మరో మోజార్ట్ను సృష్టించలేకపోయింది. కేటీఆర్గారు కోరినట్లు ఇక్కడ మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే రెండొందల మంది ఇళయరాజాలను ఈ నగరం నుంచి తయారుచేయొచ్చు. హైదరాబాద్లో మ్యూజిక్ స్కూల్, యూనివర్సిటీ ఏర్పాటు కోసం సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా’ అన్నారు. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉందని శ్రియా శరణ్ పేర్కొంది.
దిల్రాజు మాట్లాడుతూ ‘సినిమాకు , ఐఏఎస్ అధికారులకు అంతగా సంబంధం ఉండదు. ఐఏఎస్ అధికారుల ఆలోచనలు వేరే స్థాయిలో ఉంటాయి. పాపారావుగారితో నేను నాలుగు నెలలుగా ప్రయాణం చేస్తున్నా. సినిమా పట్ల ఆయన పాషన్ చూసి ఆశ్చర్యమేసింది. మ్యూజిక్ స్కూల్ ద్వారా ఆయన సమాజానికి అందిస్తున్న సందేశం బాగుంది’ అన్నారు.