చిత్రసీమలో దాదాపు పదిహేడేళ్ల కెరీర్ను పూర్తి చేసుకుంది మిల్కీబ్యూటీ తమన్నా. సినీ ప్రయాణంలో ఇప్పటివరకు దక్షిణాదిన తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే నటించిందీ భామ. హిందీలో కూడా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా ఈ అమ్మడు మలయాళంలో అరంగేట్రం చేయబోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే.. దిలీప్, సురేష్ గోపీ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అరుణ్ గోపీ ఓ భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇందులో దిలీప్కు జోడీగా తమన్నా కథానాయికగా నటించనుంది. ‘చక్కటి అభినయానికి ఆస్కారం ఉన్న పాత్ర ద్వారా మలయాళంలో ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇక్కడి ప్రేక్షకుల్ని మెప్పించేందుకు ప్రయత్నిస్తా’ అని తమన్నా ఆనందం వ్యక్తం చేసింది. ఈ ఏడాది చివరలో ఈ సినిమా సెట్స్మీదకు రానుంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో భోళా శంకర్, గుర్తుందా శీతాకాలం చిత్రాల్లో నాయికగా నటిస్తున్నది. హిందీలో ‘బబ్లీ బౌన్సర్’ చిత్రంలో ఛాలెంజింగ్ రోల్ని పోషిస్తున్నది.