నవరస నటసార్వ భౌముడు కైకాల సత్యనారాయణ మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న కైకాల శుక్రవారం తెల్లవారుజామున తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా కైకాల సత్యనారాయణ మరణం పై ఎమోషనల్ అయ్యాడు. కైకాలతో చిరంజీవికి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. కైకాలతో తాను పంచుకున్న మధుర క్షణాల గురించి గతంలో చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కైకాల ప్రతీ పుట్టినరోజు నాడు చిరంజీవి, సురేఖ దంపతులు ఆయన ఇంటికెళ్లి కేక్ కట్ చేయిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఆయన లేరనే వార్త చిరంజీవి తట్టుకోలేకపోతున్నాడు. కైకాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ భావోద్వేగ పూరితమైన లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
‘‘తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు శ్రీ కైకాల సత్యన్నారాయణ గారు మృతి చెందడం నన్ను కలచివేస్తోంది. శ్రీ కైకాల సత్యన్నారాయణ గారు తెలుగు సినీ రంగానికే కాదు.. భారత సినీ రంగానికి గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటులు. శ్రీ సత్యన్నారాయణ గారు పోషించినటువంటి వైవిధ్యమైన పాత్రలు బహుశా భారతదేశంలో వేరొక నటుడు పోషించి ఉండరు.
శ్రీ కైకాల సత్యన్నారాయణ గారితో కలిసి నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. ఆ సందర్భంగా ఆయన నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి పరిశీలించే అవకాశం నాకు కలిగింది. గొప్ప స్పాంటేనియిటీ ఉన్న అరుదైన నటులు ఆయన. డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేక పంథా. స్వచ్చమైన స్ఫటికం లాంటి మనిషి నిష్కల్మషమైన మనసున్న మనిషి. ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కలవారు. నన్ను “తమ్ముడూ” అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆనందకరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
నటన, రుచికరమైన భోజనం రెండూ శ్రీ కైకాల సత్యన్నారాయణ గారికి ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతివంటను ఎంతో ఇష్టపడేవారు. క్రిందటేడాది, ఈ యేడాది ఆయన జన్మదినం సందర్భంగా ఆయన స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిగిలిన సంతృప్తి. ఆ సందర్భంగా సత్యన్నారాయణ గారు సురేఖతో “అమ్మా ఉప్పు చేప వండి పంపించు” అని అన్నప్పుడు “మీరు త్వరగా కోలుకోండి.. ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం” అని అన్నాము. ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోష పడిపోయారు.
శ్రీ కైకాల సత్యన్నారాయణ గారు గొప్ప సినీ సంపదను అందరికీ అందించి వెళ్లిపోయారు. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను’’ అంటూ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ వేశాడు.
Rest in peace
Navarasa Natana Sarvabhouma
Sri Kaikala Satyanarayana garu 🙏 pic.twitter.com/SBhoGATr0y— Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2022