Chiranjeevi | చిరంజీవి రాజకీయాలు మానేసి హాయిగా సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. పదేండ్లు పాలిటిక్స్ చేసిన తర్వాత ఆయనకు రాజకీయమంటేనే విరక్తి వచ్చేసింది. ఈ విషయం చాలా సార్లు చెప్పాడు కూడా. తనది కానీ గ్రౌండ్లోకి వెళ్లి అనవసరంగా పదేండ్లు వేస్ట్ చేశానని చిరంజీవి ఇంతకు ముందు కూడా బాధపడ్డాడు. తనకు ఎప్పుడూ సినిమాలు మాత్రమే సంతోషాన్ని ఇచ్చాయని.. అభిమానుల ఈలలు గోలల కోసం ఎంత దూరమైన వెళ్తాను అని చెప్పాడు చిరు. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు చిరంజీవి రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన పాలిటిక్స్ గురించి కామెంట్ చేసిన ప్రతిసారి పొలిటికల్ గ్రౌండ్ మొత్తం హీట్ ఎక్కిపోతుంది. ఎందుకంటే చిరు చేసే కామెంట్స్ అంత వేడిగా ఉంటాయి మరి.
తాజాగా పద్మ విభూషణ్ వేడుకలో కూడా చిరంజీవి చేసిన కామెంట్స్ ఇలాగే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమీ అనకపోయినా.. ఇన్ డైరెక్ట్గా ఏపీ ప్రభుత్వంపై మాత్రం సెటైర్లు బాగానే వేశాడు మెగాస్టార్. పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన చిరంజీవికి చిరు సత్కారం చేశారు. ఇదే వేడుకలో మాట్లాడుతూ వెంకయ్య నాయుడు వాగ్దాటి గురించి ప్రశంసల వర్షం కురిపించారు చిరంజీవి. రాజకీయాల్లో మాట అనేది చాలా ముఖ్యమని.. ఇప్పుడు రాజకీయాలు మొత్తం వ్యక్తిగత విమర్శల వైపు వెళ్లిపోతున్నాయి అంటూ చిరు చేసిన కామెంట్స్ వేడి రాజేస్తున్నాయి. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసమే చిరంజీవి కామెంట్స్ చేశాడు అనే విషయం అర్థం అవుతుంది. ఎందుకంటే ఏపీ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు నాయకులు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి చాలా సార్లు సభల్లో బహిరంగంగా మాట్లాడాడు. దాంతో చిరంజీవి సెటైర్లు ఏపీ వైసీపీ నాయకులకు అని అర్థమవుతుంది. రాజకీయాల్లో ఏదైనా సమస్యల గురించి విమర్శించుకోవాలి తప్ప.. వ్యక్తిగత విమర్శలు చేసుకోకూడదు.. అలా చేసేవాళ్లను మీ ఓటు విలువతో ఇంటికి పంపించాలి అంటూ డైరెక్ట్ అటాక్ చేశాడు మెగాస్టార్.
రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూనే చిరు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారుతున్నాయి. గతేడాది వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో కూడా తమ రెమ్యూనరేషన్ గురించి పార్లమెంటులో మాట్లాడవలసిన పరిస్థితి ఏమొచ్చింది.. పెద్దల సభలో ఇంత చిన్న విషయం మాట్లాడాలా.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఇండస్ట్రీ మీద మీకు కోపం ఎందుకు అంటూ పొలిటికల్ లీడర్స్ పై మండి పడ్డాడు చిరంజీవి. ఇప్పుడు మరోసారి వ్యక్తిగత విమర్శల గురించి చెబుతూ హైలైట్ అయ్యాడు. ఏదేమైనా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు కానీ.. ఆయన నుంచి రాజకీయం మాత్రం దూరంగా జరగడం లేదు.