Ram Charan | రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఒకవైపు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ షూటింగ్ చేస్తూనే.. మరోవైపు రెండు సినిమాలు కమిట్ అయ్యాడు మెగా వారసుడు. కుదిరితే 2025 పూర్తయ్యలోపు మూడు సినిమాలతో రావాలి అనేది రామ్ చరణ్ ప్లాన్. దానికి తగ్గట్టుగానే పర్ఫెక్ట్ గా షెడ్యూల్ చేసుకుంటున్నాడు ఈ హీరో. త్రిబుల్ ఆర్ సినిమాకు ముందు మూడేళ్లు గ్యాప్ ఇచ్చాడు రామ్ చరణ్.
2019లో వినయ విధేయ రామ విడుదలయితే.. రాజమౌళి చేతిలో పడి నాలుగేళ్లు అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాడు. కానీ అనుకోకుండా శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి రావడంతో.. మళ్లీ మూడేళ్లుగా కనపడలేదు రామ్ చరణ్. ఇకపై ఈ గ్యాప్ అనేది అసలు ఉండకూడదు అని ఫిక్స్ అయిపోయాడు మెగా వారసుడు. అందుకే వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే బుచ్చిబాబుతో సినిమాను జూన్ నుంచి మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాడు.
ఇప్పటికే శంకర్ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. మరో 10 రోజులు షూటింగ్ చేస్తే ఈ సినిమా అయిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని వేగంగా చేసి అక్టోబర్ 30న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక నిర్మాత దిల్ రాజు ఈ సినిమా కోసం ఏకంగా 300 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. పొలిటికల్ ఎంటర్టైనర్ గా వస్తున్న గేమ్ చేంజర్.. కచ్చితంగా ఇండియన్ సినిమాలో సరికొత్త అధ్యాయం లిఖిస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు శంకర్.
ఇదిలా ఉంటే బుచ్చిబాబు సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ఇక సుకుమార్ సినిమాను ఈ మధ్య అఫీషియల్ గా ప్రకటించాడు రామ్ చరణ్. ఇప్పటికే ఈ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ అయింది. దాంతో ఈసారి ఎలాంటి నేపథ్యంలో సినిమా చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దీనికి సమాధానంగా రజాకార్ బ్యాక్ డ్రాప్ అని తెలుస్తోంది. చాలా రోజులుగా సుకుమార్ ఈ నేపథ్యంలో ఒక సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు. అప్పట్లో విజయ్ దేవరకొండతో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి తీసుకురావాలని ఆలోచించినా కూడా అది వర్కౌట్ అవ్వలేదు. ఇక పుష్ప ప్రపంచంలోకి వెళ్లడంతో ఐదేళ్లుగా సుకుమార్ పూర్తిగా బిజీ అయిపోయాడు.
ఆగస్టు 15న పుష్ప సీక్వెల్ విడుదల కానుంది. దీని తర్వాత రామ్ చరణ్ సినిమా మొదలు కానుంది. ఇది స్వతంత్ర్య సమయంలో జరిగిన రజాకార్ పోరాట నేపథ్యంలో రాబోతుందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఒకవేళ నిజంగానే రజాకార్ నేపథ్యంలో రామ్ చరణ్, సుకుమార్ సినిమా వస్తే అంతకంటే సంచలనం మరొకటి లేదు. అన్నట్టు ఈ మధ్యే రజాకార్ నేపథ్యంలో ఒక సినిమా వచ్చింది. దానికి కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి.