తెలుగు తారాపథంలో దూసుకుపోతున్నది హర్యానా సుందరి మీనాక్షి చౌదరి. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ‘ఖిలాడీ’ ‘హిట్-2’ సినిమాలతో యువతరానికి చేరువైంది. చక్కటి అందం, అభినయం కలబోతగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మహేష్బాబు తాజా చిత్రం ‘గుంటూరు కారం’ నుంచి పూజాహెగ్డే తప్పుకోవడంతో ఆ స్థానంలో నాయికగా అవకాశాన్ని సంపాదించుకొని ఒక్కసారిగా పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది.
తాజాగా ఈ భామ మరో భారీ చిత్రంలో అవకాశాన్ని చేజిక్కించుకుంది. వరుణ్తేజ్ కథానాయకుడిగా ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈ నెల 27న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇందులో వరుణ్తేజ్ సరసన కథానాయికగా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. 1960 నేపథ్యంలో సాగే ఈ కథలో ఆమె పాత్ర అభినయ ప్రధానంగా సాగుతుందని చిత్రబృందం పేర్కొంది.