సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మసూద’. సాయికిరణ్ దర్శకుడు. స్మధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ట్రైలర్ను ఇటీవలే అగ్ర హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. సోమవారం చిత్రబృందంతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఈ సినిమా బృందంలో చాలా మంది సన్నిహితులున్నారు.
ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ఆసక్తికరంగా ఉండటమే కాకుండా భయపెట్టేలా ఉంది. అందరూ థియేట్లరకు వెళ్లి ఈ సినిమా చూడండి’ అన్నారు. ‘అప్పుడే భయపడాల్సిన అవసరం లేదు. అస్సల్ భయం ముందుంది’ అంటూ విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన లభిస్తున్నదని, చాలా కాలం తర్వాత తెలుగులో వస్తున్న హారర్ డ్రామా చిత్రమిదని నిర్మాత తెలిపారు. శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నగేష్ బానెల్, సంగీతం: ప్రశాంత్ విహారి, రచన-దర్శకత్వం: సాయికిరణ్.