Maruthi | టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మారుతి ఇటీవల చేసిన రాజా సాబ్ సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. ప్రభాస్ వంటి స్టార్ హీరోతో చేసిన ఈ హారర్ ఫ్యాంటసీ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, ప్రేక్షకులను నిరాశపరిచింది. సినిమా విడుదలకు ముందు వింటేజ్ లుక్లో ప్రభాస్, కామెడీ ట్రాక్, ముగ్గురు హీరోయిన్స్ వంటి అంశాలతో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత కథ, విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా ఈ సినిమాపై నెగటివ్ టాక్ కొనసాగింది.
ఈ నేపథ్యంలో కొంతకాలంగా సైలెంట్గా ఉన్న మారుతి తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్పై అప్డేట్ ఇచ్చాడు. తన కొత్త సినిమా స్క్రిప్ట్ ప్రస్తుతం చివరి దశలో ఉందని, ఈ ప్రాజెక్ట్కు శ్రీరాముడి ఆశీస్సులు ఉన్నాయని ఆయన పేర్కొన్నాడు.ఇదిలా ఉండగా, మారుతి తదుపరి సినిమాకు ‘హ్యాపీ పొంగల్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, తనకు సొంతమైన కామెడీ శైలిలో తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ కాంబినేషన్పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ‘రాజాసాబ్’ ఫలితం తర్వాత మారుతి మరింత జాగ్రత్తగా స్క్రిప్ట్పై పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. తన తదుపరి సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్లోకి రావాలని ఈ దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్పై పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.