రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మారెమ్మ’. మంచాల నాగరాజు దర్శకుడు. మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. బుధవారం టీజర్ను విడుదల చేశారు. గ్రామదేవత మారెమ్మ చుట్టూ అల్లుకున్న సన్నివేశాలతో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఓ అంటువ్యాధి గ్రామాన్ని చుట్టుముట్టి ప్రజల ప్రాణాల్ని హరిస్తుంటుంది.
ఈ నేపథ్యంలో గ్రామస్తులు తాము నమ్మిన దైవం మారెమ్మ తల్లిని ప్రార్థిస్తారు. మారెమ్మకు సంబంధించిన పవిత్రమైన ఎద్దును కాపాడే బాధ్యత హీరోపై పడుతుంది. అయితే ఓ రోజు ఆ ఎద్దు అనూహ్యంగా అదృశ్యమవుతుంది. ఈ నేపథ్యంలోని సంఘటనలతో కథపై ఆసక్తినిరేకెత్తిస్తూ టీజర్ సాగింది. తెలంగాణలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని మీడియా సమావేశంలో మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రశాంత్ అంకిరెడ్డి, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, రచన-దర్శకత్వం: మంచాల నాగరాజ్.