తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సబిత ఇంద్రారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు వికారాబాద్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అనంతగిరి హిల్స్ లో ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్ట్ అభివృద్ధి పై చర్చించారు. అనంతగిరి హిల్స్ లో ఏర్పాటు చేయబోతున్న ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్టు ఏర్పాటు కు సుమారు 150 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారన్నారు మంత్రులు.
ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా 500 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ .ఈ మీట్ లో ప్రముఖ నటుడు శ్రీ మంచు మనోజ్ కుమార్ అడ్వెంచర్స్ టూరిజం, వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు పై రూపొందించిన పలు ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. కీలక భేటిలో మనోజ్ పాల్గొని తన అభిప్రాయాలని వ్యక్తపరచడం విశేషం.
ప్రస్తుతం మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి సినిమాని తన సొంత ప్రొడక్షన్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇదే ఏడాదిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించక పోతే వచ్చే ఏడాది మాత్రం తప్పకుండా రిలీజ్ చేయవచ్చని సమాచారం. ఇందులో అల్లరి నరేష్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.