Manjummel Boys | మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై రికార్డులు బద్దలు కొడుతున్న చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys). సర్వైవర్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 22న విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. కేవలం రూ.5కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ చిత్రం రిలీజైన రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. రిలీజైన 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కును దాటి మాలీవుడ్లో ఈ మార్కును ఫాస్ట్గా దాటిన సినిమాగా చరిత్రకెక్కింది.
వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాను చిదంబర్ పీ పొదువల్(Chidambaram S Poduval) దర్శకత్వం వహించగా.. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భసి, బాలు వర్గీస్, గణపతి, సీనియర్ నటుడు లాల్, అరుణ్ కురియన్, ఖలిడ్ రెహ్మాన్, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, షెబిన్ బెన్సన్, లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ఈ సినిమా తెలుగులోకి రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగుకు సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం. ఇక ఈ మూవీని మార్చి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 2006లో తమిళనాడు కొడైకెనాల్లోని గుణ గుహలలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ గుణ గుహలను సందర్శించడానికి వెళ్లగా ఆ గ్యాంగ్లో ఒకరు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోతాడు. అయితే అతడిని కాపాడేందుకు అతని స్నేహితులు చేసిన రెస్క్యూ ఈ సినిమా స్టోరీ. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సినిమా రావడంతో ప్రేక్షకులు కాసులు వర్షం కురిపిస్తున్నారు.