హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడిగా మంచు విష్ణు ( Manchu Vishnu ) శనివారం ప్రమాణస్వీకారం చేశారు. మంచు విష్ణు, ఆయన ప్యానెల్ సభ్యుల చేత మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన ఈ వేడుకకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మోహన్ బాబు, నరేశ్తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మంచు విష్ణు, మోహన్ బాబు ఆశీస్సులు తీసుకున్నారు. అయితే విష్ణు ప్యానెల్ నుంచి గెలుపొందిన రఘుబాబు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. విష్ణు ప్యానెల్ నుంచి రఘు బాబు ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు.
ఈ నెల 10న మా జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాశ్ రాజ్పై 107 ఓట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’ )అధ్యక్షుడిగా మంచు విష్ణు 13వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పెన్షన్ల ఫైలుపై తొలి సంతకం చేశారు.