కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ఆయన చేసిన సినిమాలను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు ఆయన తనయుడు మంచు విష్ణు.
తండ్రి మాదిరిగానే యాక్షన్ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు విష్ణు. సొంత బ్యానర్లో భారీ బడ్జెట్ సినిమాలతో పాటు ఓటీటీ సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే తమ సొంత బ్యానర్స్ లో ఇంతవరకూ వచ్చిన సినిమాలలో ‘అల్లుడు గారు’ అంటే చాలా ఇష్టం అని చెప్పిన విష్ణు ఈ సినిమా ఆల్ టైమ్ ఫేవరేట్ అన్నారు.
‘పెదరాయుడు’ .. ‘రామన్న చౌదరి’ .. ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాలలో నాన్నలా నేను నటించలేను. అల్లుడు గారు సినిమా నేను చేయదగినది కనిపిస్తుంది. అలానే ‘ఎమ్. ధర్మరాజు M.A.కూడా. ఒక నటుడిగా నా స్థాయి ఎంత అనే విషయంపై నన్ను నేను చెక్ చేసుకోవాలంటే అందుకు నేను చేయవలసిన సినిమా ఇది అని మంచు విష్ణు పేర్కొన్నారు. రానున్న రోజులలో విష్ణు అల్లుడు గారు రీమేక్తో ప్రేక్షకులని అలరించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం ఢీ సీక్వెల్ షూటింగ్తో బిజీగా ఉన్నాడు విష్ణు.