Manchu Vishnu | తిరుపతి జిల్లాలో ఉన్న నటుడు మోహన్ బాబు ప్రైవేటు యూనివర్సీటికి ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడంతో పాటు ఆదాయాన్ని వెల్లడించకపోవడం, అటెండెన్స్ నిర్వహణలో అవకతవకలు ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడం తదితర కారణాలతో యూనివర్సీటికి కమిషన్ 15 లక్షల జరిమానా విధించింది. అయితే ఈ సోమ్మును వర్సీటి చెల్లించగా.. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26 కోట్ల 17లక్షల 52 వేలు తిరిగి చెల్లించాలని… గత నెల 17న కమిషన్ ఆదేశాలు జారీ చేసి ఆ వివరాలను వెబ్ సైట్ లో ఉంచింది. 2022-23 నుంచి గతేడాది సెప్టెంబరు 30 వరకు విద్యార్థుల నుంచి… మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయం అదనంగా 26 కోట్ల 17 లక్షలు వసూలు చేసినట్లు కమిషన్ తేల్చింది. ఈ మొత్తాన్ని విద్యార్థులకు… 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. అలాగే విశ్వవిద్యాలయం అనుమతి గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వం UGC, AICTE సహా… సంబంధిత సంస్థలకు సిఫార్సు చేసింది. అయితే కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై మోహన్ బాబు విశ్వవిద్యాలయం హైకోర్టును ఆశ్రయించగా 3 వారాలపాటు తాత్కాలిక స్టేను విధిస్తూ గత నెల 26న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. అయితే ఈ వివాదంపై ప్రస్తుతం చర్చలు నడుస్తుండగా.. దీనిపై యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు (Manchu Vishnu) తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని కావాలని తప్పుడూ ప్రచారం చేస్తున్నట్లు తెలిపాడు.
మోహన్బాబు విశ్వవిద్యాలయం (Mohan Babu University)కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERMC) చేసిన సిఫార్సులపై వివిధ మీడియా మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారాన్ని ఉద్దేశించి యూనివర్సిటీ వైస్-ఛైర్మన్ మంచు విష్ణు ఒక ప్రకటన విడుదల చేశారు. యూనివర్సిటీ ప్రతిష్ఠను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసిన సమాచారాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నారని మంచు విష్ణు ఆరోపించారు. ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని ఆయన తల్లిదండ్రులకు మీడియాకు విజ్ఞప్తి చేశారు. విచారణ సమయంలో మోహన్ బాబు యూనివర్శిటీ బృందం పూర్తిగా సహకరించిందని అదే కమిషన్ తన నివేదికలో పేర్కొనడం చూస్తే ఎలాంటి తప్పు జరగలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది అని ఆయన అన్నారు. తమకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వస్తున్న వేలాది తల్లిదండ్రులకు విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. ఛాన్సలర్ డాక్టర్ ఎం.మోహన్ బాబు మార్గదర్శకత్వంలో తాము ప్రపంచ స్థాయి సమగ్ర విద్యను అందిస్తూ యువతను శక్తిమంతం చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తామని మంచు విష్ణు ఈ సందర్భంగా రాసుకోచ్చాడు.