Manchu Vishnu | మా అధ్యక్షుడు మంచు విష్ణు తాను ఇచ్చిన హామీ మేరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించినట్లు తెలిపారు. అసోసియేషన్ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు హైదరాబాద్లోని ఏఐజీ, అపోలో, కిమ్స్, మెడికవర్, సన్ షైన్ దవాఖానలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ దవాఖానల్లో 50 శాతం రాయితీపై ఓపీ కన్సల్టేషన్, ఎమర్జెన్సీ వేళ ఫ్రీ అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తారు. కనుక సభ్యులు ఈ దవాఖానల్లో నిరంతరం తమ ఆరోగ్యాన్ని ఉచితంగా చెక్ చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఇక వైద్య నిపుణులతో ఫేస్ టు ఫేస్ సంప్రదింపులతోపాటు వీడియో కన్సల్టేషన్ కూడా చేసుకోవచ్చునన్నారు.
అసోసియేషన్ సభ్యులందరికీ దశల వారీ ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు. వచ్చేనెలలో మెడికవర్, మార్చిలో ఏఐజీ, జూన్లో అపోలో, సెప్టెంబర్లో కిమ్స్ దవాఖానలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నారు. అలాగే టెనెట్ డయాగ్నస్టిక్ సెంటర్లోనూ మా సభ్యులకు రాయితీపై రోగ నిర్దారణ పరీక్షలు చేయించనున్నామని పేర్కొన్నారు.