‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’) ఎన్నికలు తెలుగు చిత్రసీమలో ఆసక్తినిరేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికల్ని నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. అధ్యక్ష పదవి కోసం సీనియర్ నటుడు ప్రకాష్రాజ్, యువ హీరో మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు పోటీ పడుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఇరువురు తమ బృందాలతో వ్యూహప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇప్పటికే ప్రకాష్రాజ్ తన ప్యానెల్ను ప్రకటించి ప్రచారాన్ని వేగవంతం చేశారు. గురువారం మంచు విష్ణు తన ప్యానెల్ను ప్రకటించారు. రఘుబాబు (జనరల్ సెక్రటరీ), బాబు మోహన్ (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), మాదాల రవి (వైస్ ప్రెసిడెంట్), పృథ్వీరాజ్ (వైస్ ప్రెసిడెంట్), శివబాలాజీ (కోశాధికారి), కరాటే కల్యాణి (జాయింట్ సెక్రటరీ), గౌతంరాజులు (జాయింట్ సెక్రటరీ).. మంచు విష్ణు ప్యానెల్ తరపున బరిలోకి దిగుతున్నారు. మరో పద్దెనిమిది మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా పోటీకి దిగుతున్నారు.