తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య , వారి వ్యక్తిగత భద్రతా సిబ్బందికూడా మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయితేజ ఒకరు. చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ వీరమరణం చెందడంతో ఆయన స్వగ్రామం ఎగువరేగడిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. సాయితేజ ఆకస్మిక మృతి తీరని విషాదం మిగిల్చిందని, ఆయన కుటుంబానికి అండగా నిలబడతామని పలువురు చెప్పుకొస్తున్నారు.
తాజాగా సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు.. సాయితేజ సతీమణి శ్యామలతో ఫోన్లో మాట్లాడారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జవాన్ పిల్లలకు ఇంజనీరింగ్ వరకూ చదువు చెప్పించే బాధ్యత తనదని చెప్పారు.విష్ణు సూచన మేరకు సంస్థ ప్రతినిధులు లాన్స్నాయక్ సాయితేజ ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.ఇంజనీరింగ్ వరకు తమ విద్యా సంస్థలోనే ఉచితంగా చదివిస్తామని చెప్పారు.
త్వరలో సాయితేజ కుటుంబాన్ని నేరుగా వెళ్లి కలనున్నానని మంచు విష్ణు చెప్పారు. సాయి తేజ్ ఆత్మకు సద్గతులు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.అమర జవాన్ సాయితేజకు ఐదేళ్ల కుమారుడు మోక్షజ్ఞ, రెండేళ్ల కుమార్తె దర్శిని ఉన్నారు. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలనే ఉద్దేశంతో ఆయన తన కుటుంబాన్ని స్వగ్రామం నుంచి మదనపల్లెకి మార్చారు.