Manchu Manoj | సినీ నటుడు మంచు మనోజ్ మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఒక విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఆయన, నాదర్గుల్లోని మాతృదేవోభవ అనాధ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడి నిర్వాహకులు చేస్తున్న సేవలను అభినందించారు. ఆశ్రమంలో ఉన్న అనాధలు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల సంక్షేమం కోసం తన వంతు సహాయం అందిస్తూ మంచి మనసును చాటుకున్నారు.ఆశ్రమ నిర్వాహకుడు గిరి సోషల్ మీడియా ద్వారా తమ ఆశ్రమ పరిస్థితిని, అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ సహాయం కోరారు. ఆ విజ్ఞప్తికి స్పందించిన మంచు మనోజ్ మంగళవారం ఉదయం స్వయంగా ఆశ్రమానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు.
అక్కడి అవసరాలను తెలుసుకుని ఆశ్రమానికి టేబుల్లు, కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంచు మనోజ్, ఆశ్రమ నిర్వాహకుడు గిరి చేస్తున్న సేవలను ప్రత్యేకంగా అభినందించారు. నేటి సమాజంలో మానసిక స్థితి సరిగా లేని వారు, నిరాశ్రయులు, అనాధల పట్ల చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అలాంటి సమయంలో వారిని దగ్గరకు తీసుకుని ఆశ్రయం కల్పించడం, వారికి ఆహారం, సంరక్షణ అందించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు.
“సమాజం పక్కన పెట్టిన వ్యక్తులకు అండగా నిలబడటం సాధారణ విషయం కాదు. వారికి మనం అందించే ప్రేమ, భరోసా ఎంతో విలువైనవి. గిరి చేస్తున్న సేవ నిజంగా అభినందనీయం” అని మంచు మనోజ్ అన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా మాతృదేవోభవ అనాధ ఆశ్రమానికి తన పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఎల్లప్పుడూ ఆశ్రమానికి అండగా నిలుస్తానని నిర్వాహకుడు గిరికి భరోసా ఇచ్చారు. ఈ సందర్శనలో మరో హృదయాన్ని కదిలించే ఘటన కూడా చోటుచేసుకుంది. మలక్పేట్ ప్రాంతంలో రోడ్డుపై నిరాశ్రయుడిగా తిరుగుతున్న ఒక వ్యక్తిని ఆశ్రమ నిర్వాహకులు తీసుకువచ్చి సంరక్షిస్తున్నారు. అతడికి కొత్త జీవితం అందించే ప్రయత్నంలో భాగంగా, మంచు మనోజ్ సమక్షంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనిని నిర్వాహకులు “పునర్జన్మ ఛాలెంజ్ – ఒక్క క్షణం అనాధ మార్పు కోసం” పేరుతో చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ వ్యక్తికి శుభ్రత, సంరక్షణతో పాటు కొత్త జీవితం ప్రారంభించే అవకాశం కల్పించారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేశాయి.