Manchu Manoj | గతకొంత కాలంగా చట్టా పట్టాలేసుకుని మీడియా కంట పడుతున్న మంచు మనోజ్, భూమా మౌనికలు శుక్రవారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి మంచు లక్ష్మీ ఇల్లు వేదికైంది. మెహందీ ఫంక్షన్ నుంచి సంగీత్, హల్దీ వంటి కార్యక్రమాలను తనే స్వయంగా చూసుకుంది. ఇక పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు వారం నుంచే మొదలు పెట్టింది. శుక్రవారం రాత్రి వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇరుకుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు గతరాత్రి నుంచి నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా మనోజ్.. మంచు లక్ష్మీ గురించి ఓ ఎమోషనల్ నోట్ను రాశాడు. అక్కా ఏ జన్మ పుణ్యమో నాది. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. లవ్ యూ అక్కా అంటూ ఇన్స్టా స్టోరీలో తనను పెళ్లి కొడుకుని చేస్తున్న మంచు లక్ష్మీ ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక మనోజ్కు గతంలో ప్రణతి రెడ్డితో వివాహం జరిగింది. కాగా నాలుగేళ్ల తర్వాత పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక భూమా మౌనిక రెడ్డి కూడా గతంలో గణేష్ రెడ్డి అనే వ్యాపార వేత్తని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే కారణాలేంటో తెలియదు కానీ వీరిద్ధరూ కొన్నాళ్లకే విడిపోయారు.