Manchu Manoj | టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ త్వరలోనే తన భార్య భూమా మౌనిక రెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మే 20న తన పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల స్థాపించిన ‘ఐక్య ధైర్యసేన సమితి’ (AIKYA) ఆశయాలతో పాటు తన వ్యక్తిగత, రాజకీయ భవిష్యత్తుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
”సమాజంలో మార్పు కోసం, ప్రజలకు సేవలందించడమే లక్ష్యంగా ‘ఐక్య’ (AIKYA) సంస్థను ప్రారంభించినట్లు మనోజ్ వెల్లడించారు. దీనిపై వస్తున్న పుకార్లను కొట్టిపారేస్తూ ఇది కేవలం ఒక సేవా సంస్థ మాత్రమేనని, దీనికి ఎలాంటి రాజకీయ రంగు లేదని స్పష్టం చేశారు. ఏ పార్టీతోనూ దీనికి ముడిపెట్టవద్దని కోరిన ఆయన, ఈ సంస్థ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో చేపట్టే సేవా కార్యక్రమాలకు తన సొంత నిధులనే వెచ్చించనున్నట్లు ప్రకటించారు. సమాజంలో అణచివేతకు గురవుతున్న వారి తరఫున, ప్రజల సమస్యలపై నిలబడే ఒక గొంతుకగా ఈ వేదికను సిద్ధం చేసినట్లు తెలిపారు. అదే సమయంలో తన భార్య మౌనిక రాజకీయరంగ ప్రవేశంపై వస్తున్న వార్తలను మనోజ్ ధ్రువీకరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఖచ్చితంగా పోటీ చేస్తారని స్పష్టం చేస్తూ, తాము ఇప్పటికే పరోక్షంగా రాజకీయాల్లో భాగమయ్యామని, మౌనిక వచ్చే ఎన్నికల బరిలో నిలవడం ఖాయమని పేర్కొంటూ ఆమె పొలిటికల్ ఎంట్రీపై ఉన్న ఉత్కంఠకు తెరదించారు.