‘బలగం’ తర్వాత దర్శకుడు ‘ఎల్లమ్మ’ సినిమా ప్రకటించిన నాటినుంచీ ఈ సినిమాలో నటించే తారల వ్యవహారం ఓ ప్రహసనంగా మారింది. హీరోగా ముందు చాలామంది పేర్లు అనుకున్నారు. చివరకు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఖరారయ్యారు. ఆయనపై తాజాగా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఎవరు? ప్రస్తుతం ఫిల్మ్ వర్గాలను వెంటాడుతున్న ప్రశ్న ఇది. మొదట్లో సాయిపల్లవి అన్నారు.
ఆ తర్వాత కీర్తి సురేశ్ పేరు వినిపించింది. ఈ వరుసలోనే చాలామంది హీరోయిన్ల పేర్లు మీడియాలో చక్కర్లు కొట్టాయి. చివరకు మలయాళ మందారం మమితాబైజు ఖరారైందంటూ ఓ వార్త బలంగా వినిపిస్తున్నది. అయితే.. ఈ పేరు బయటకు వచ్చిన నాటినుంచీ, ప్రేమలు, డ్యూడ్ లాంటి ట్రెండీ క్యారెక్టర్లు చేసే మమితాబైజు ఈ విలేజ్ డ్రామాలో ఇమడగలదా? అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ధనుష్ ‘కర’ సినిమాలో ఆమెది విలేజ్ నేపథ్య పాత్రేననీ, తను స్వతహాగా మంచినటి కాబట్టి, ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేయగలదని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అధికారిక ప్రకటన వచ్చేదాకా ఇవన్నీ ఊహాగానాలే అనాలి.