‘పవిత్రాలోకేష్ను నేను పెళ్లి చేసుకున్నానని చాలా మంది అనుకుంటు న్నారు. నా దృష్టిలో పెళ్లంటే రెండు హృదయాల సంగమం. ఆ నిర్వచనం ప్రకారం మా ఇద్దరి పెళ్లయిపోయినట్లే’ అన్నారు సీనియర్ నటుడు నరేష్. ఆయన పవిత్రాలోకేష్తో కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఎం.ఎస్.రాజు దర్శకుడు. విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ స్వయంగా నిర్మించారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నరేష్ మాట్లాడుతూ ‘వివాహ వ్యవస్థపై నాకు గొప్ప నమ్మకం ఉంది. పెళ్లి గొప్పతనాన్ని ఈ సినిమాలో తెలియజెప్పాం. అద్భుతమైన కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కించాం. కథానుగుణంగా చక్కటి టైటిల్ కుదిరింది.
ప్రేక్షకులకు ఆద్యంతం వినోదాన్ని అందించే చిత్రమిది’ అన్నారు. ‘సినిమాకే కాదు ప్రతి వ్యక్తి జీవితానికి సెకండాఫ్ చాలా ముఖ్యం. జీవితం అక్కడే కీలక మలుపు తీసుకుంటుంది. ఇదే విషయాన్ని ఈ కథలో చెప్పాం. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ ఇది’ అని దర్శకుడు ఎం.ఎస్.రాజు తెలిపారు. పవిత్రా లోకేష్ మాట్లాడుతూ ‘ఈ బ్యానర్కు కృష్ణ, విజయనిర్మలగార్ల ఆశీస్సులున్నాయి. గొప్ప ఆలోచనలతో ఎం.ఎస్.రాజు ఈ సినిమాను తెరకెక్కించారు. దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో నరేష్ ఒకరు. ఈ సినిమా తప్పకుండా అందరిని మెప్పిస్తుంది’ అని చెప్పింది. ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎన్.బాల్రెడ్డి, సంగీతం: సురేష్ బొబ్బిలి, అరుల్దేవ్, సాహిత్యం: అనంతశ్రీరామ్, రచన-దర్శకత్వం: ఎం.ఎస్.రాజు.