Gandhimathi Balan | దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ మలయాళ సినీ నిర్మాత గాంధీమతి బాలన్ (66) కన్నుమూశారు. తిరువనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో స్థానికంగా ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన మృతికి ఇంకా పూర్తి కారణాలు తెలియరాలేదు. ఆయన మరణంతో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకున్నది. గాంధీమతి బాలన్ 1980ల్లో అగ్ర నిర్మాతల్లో ఒకరు.
గాంధీమతి పేరుతోనే ఆయన నిర్మాణ సంస్థను ప్రారంభించి.. నిర్మించారు. మూన్నం పక్కం, నంబరతి పూవు, ఈ తనుత వేలుప్పన్ కలతు, పథముదయం, సుఖమో దేవి, ఇదిరి నేరం ఒత్తిరి కార్యమ్ చిత్రాలను నిర్మించారు. ఆయన కెరీర్లో 33 సినిమాలను నిర్మించారు. ఆయన ‘ఆడమింటే వారియెల్లు’ వంటి పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. కొద్ది సంవత్సరాల కిందట ఆయన తన కూతురుతో కలిసి తిరువనంతపురంలోని టెక్నో పార్క్ ప్రధాన కార్యాలయంలో సైబర్ ఫోరెన్సిక్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. చలనచిత్ర పరిశ్రమలో పైరసీని నిరోధించే లక్ష్యంతో ఈ స్టార్టప్ను తీసుకువచ్చారు.