Oscar Awards | 2024వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ఎంపికలో భాగంగా మనదేశం నుంచి మలయాళ చిత్రం ‘2018’ని ఎంపిక చేశారు. ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం’ విభాగంలో ఈ చిత్రాన్ని ఎంపిక చేయడం జరిగింది. ప్రముఖ దర్శకుడు గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన కమిటీ, దరఖాస్తు చేసుకున్న 22 చిత్రాలను వీక్షించి ‘2018’ సినిమాను ఎంపిక చేసింది. 2018లో సంభవించిన వరదలు కేరళను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.
ఆ నేపథ్యాన్ని తీసుకొని దర్శకుడు జూడ్ ఆంథోని జోసెఫ్ హృదయాలకు హత్తుకునేలా ఈ సినిమా తీశారు. టోవినో థామస్ కథానాయకుడు. ‘ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో’ అనే ఉపశీర్షికకి తగ్గట్టుగా ఇందులోని ప్రతి పాత్ర మనసులకు హత్తుకుపోతుంది. కేరళలో వందకోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందీ ఈ చిత్రం. తెలుగు నుంచి దసరా, బలగం కూడా ఎంట్రీకి దరఖాస్తు చేసుకోగా ఆ సినిమాలకు నిరాశే ఎదురైంది.