Chiranjeevi154 Movie Villain | చిరు రీ ఎంట్రీ తర్వాత మంచి జోష్లో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన వరుసగా సినిమాలను చేస్తూ యువ హీరోలకు పోటీనిస్తున్నాడు. అప్పట్లో చిరంజీవికి ఎంత బిజీ షెడ్యూల్ ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది. ఇటీవలే చిరు ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలో చిరు తన తదుపరి చిత్రాలపై పూర్తి దృష్టిని పెట్టాడు.ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య’ ఒకటి. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర కోసం మేకర్స్ చాలా రోజులగా అన్వేషిస్తున్నారట. ఈ క్రమంలో విజయ్ సేతుపతి, సముద్రఖని విలన్గా నటిస్తారని గత కొన్ని రోజుల ముందు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం మేకర్స్ బీజూమీనన్ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తుందట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’తో బిజు మీనన్ పేరు దక్షిణాదిన మారు మోగిపోయింది. కాగా బిజూ మీనన్ ‘రణం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి ఈ చిత్రంలో అండర్కవర్ కాప్గా కనిపించనున్నాడు.విశాఖపట్నం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మాస్రాజ రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నారు.