ఈ రోజుల్లో ఓ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఎన్నో రకాల పద్ధతులు వాడుకుంటున్నారు దర్శక నిర్మాతలు. అందులో కొన్ని సక్సెస్ అవుతుంటాయి..మరికొన్ని అంతగా వర్కవుట్ అవ్వవు. ఈ క్రమంలోనే ఇప్పుడు మేజర్ సినిమా యూనిట్ కూడా విడుదల విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. అడివి శేష్ (Adivi Sesh) హీరోగా శశికిరణ్ టిక్కా (Sashi Kiran Tikka ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మేజర్ (Major) జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. కథ నచ్చి ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు.
26/11 ముంబై ఉగ్రదాడిలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాడు శశికిరణ్. తెలుగు, హిందీ, మలయాళంలో ఒకే రోజు విడుదల కానుంది మేజర్. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలు తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మరీ ముఖ్యంగా ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఏ సినిమా యూనిట్ చేయని సాహసం మేజర్ చేస్తుంది.
విడుదలకు 10 రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు మేజర్ యూనిట్. దేశంలోని 9 నగరాల్లో ప్రత్యేకమైన థియేటర్స్ లో మే 24 నుంచి మేజర్ ప్రీమియర్స్ స్క్రీనింగ్ కానున్నాయి. హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీ, జైపూర్, బెంగళూరులలో మేజర్ ప్రీమియర్స్ స్క్రీనింగ్ కానున్నాయి. ఈ ఐడియా చాలా క్రియేటివ్ గా ఉంది. కానీ పది రోజుల ముందే సినిమా విడుదల చేస్తే పైరసీ మాట ఏమిటి అనే సందేహాలు కూడా వస్తున్నాయి.
ఈ రోజుల్లో థియేటర్లో బొమ్మ పడితే దాన్ని బయటకు రాకుండా ఆపడం చాలా కష్టం.. ఈ విషయంలో మేజర్ చిత్రయూనిట్ చాలా కష్టపడాల్సి వస్తుంది. అది రిస్క్ అని తెలిసినా కూడా తమ సినిమాపై ఉన్న నమ్మకంతో 10 రోజుల ముందుగానే ప్రీమియర్స్ వేస్తున్నారు. మరి మేజర్ యూనిట్ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.