‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన అపూర్వ విజయంతో పాటు ‘నాటు నాటు’ పాట ఆస్కార్ పురస్కారాన్ని గెలుపొందడంతో చిత్ర దర్శకుడు రాజమౌళి పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోయింది. ఈ నేపథ్యంలో మహేష్బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందించబోతున్న సినిమా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యూనివర్సల్ అడ్వెంచర్ కథాంశంతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా బిజినెస్ కోసం ఇప్పటికే ఆయన హాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణుల కూడా పనిచేయబోతున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్లో షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్బాబు నటిస్తున్న సినిమా సెప్టెంబర్ కల్లా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుందని, ఆ వెంటనే రాజమౌళి చిత్రం పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఇక త్రివిక్రమ్-మహేష్బాబు కాంబో చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానుంది.