ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నారు అగ్ర హీరో మహేష్బాబు. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్రబృందం ఇటీవలే కొంచెం బ్రేక్ తీసుకుంది. జూన్లో మరో షెడ్యూల్ను మొదలుపెడతారని సమాచారం. ఇదిలావుండగా రాజమౌళి సినిమా అనంతరం మహేష్బాబు ప్రాజెక్ట్ ఏమిటి? ఏ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. తాజా సమాచారం ప్రకారం ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మహేష్బాబు సినిమా చేస్తారని సమాచారం.
మహేష్బాబు ‘వన్’ సినిమాకు బుచ్చిబాబు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అప్పటి నుంచే ఇద్దరికి సాన్నిహిత్యం ఉంది. ‘ఉప్పెన’ రిలీజ్ తర్వాత బుచ్చిబాబు వర్క్ని బాగా నచ్చడంతో ‘మంచి కథ సిద్ధం చేసుకో. సినిమా చేద్దాం’ అని మాటిచ్చారట మహేష్బాబు. ప్రస్తుతం రామ్చరణ్తో ‘పెద్ది’ చిత్రాన్ని చేస్తున్నాడు బుచ్చిబాబు. ఇది పూర్తయిన వెంటనే మహేష్బాబుతో సినిమా చేసే అవకాశం ఉందంటున్నారు. రాజమౌళి-మహేష్బాబు సినిమా పూర్తవడానికి ఏడాదికిపైగా సమయం పడుతుందని, ఆలోగా బుచ్చిబాబు స్క్రిప్ట్తో సిద్ధంగా ఉంటారని ఫిల్మ్నగర్ టాక్. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకురానుంది.