సంక్రాంతిని టార్గెట్ చేసుకుని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది మహేశ్, త్రివిక్రమ్ల ‘గుంటూరుకారం’ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ప్రత్యేకంగా వేసిన గుంటూరు మిర్చియార్డ్ సెట్లో జరుగుతున్నది. ఈ సెట్లో శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో ఓ మాస్ గీతాన్ని దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. మహేశ్బాబుతోపాటు ఇతర తారాగణం కూడా ఈ పాటలో పాల్గొంటున్నది.
‘గుంటూరుకారం’ మహేశ్ కంటే త్రివిక్రమ్కి చాలా ఇంపార్టెంట్ మూవీ. ఎందుకంటే ఈ సినిమా తర్వాత మహేశ్ ఎలాగూ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తారు. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఆ సినిమాతో మహేశ్ పాన్ వరల్డ్ హీరోగా రూపాంతరం చెందడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఇక త్రివిక్రమ్ ‘గుంటూరుకారం’ తర్వాత అల్లు అర్జున్తో సినిమా చేయబోతు న్నారు.
తను ఇప్పటికే ‘పుష్ప’తో పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. అల్లు అర్జున్ చిత్రం అంటే పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవ్వడం కామన్. మరి అలాంటప్పుడు త్రివిక్రమ్ మేకింగ్లో యూనివర్సల్ అప్పీల్ అవసరం. దానికి ‘గుంటూరుకారం’ చిత్రమే నాందిగా నిలవాలి. అందుకే పట్టుదలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే.