Super Star Krishna | కుటుంబంలోని ఓ వ్యక్తి మృతి చెందితే కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. అలాంటిది ఒకరి మృతిని మరవకముందే మరొకరు మృతి చెందితే.. ఆ బాధ వర్ణనాతీతం. ప్రస్తుతం ఘట్టమనేని ఫ్యామిలీది ఇదే పరిస్థితి. ఏకంగా ఒకే ఏడాది ముగ్గురిని కోల్పోయిన ఆ కుటుంబం మాటలకందని విషాదంలోకి వెళ్లిపోయింది.
2022 సంవత్సరం ఘట్టమనేని కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఏడాది ఆరంభంలోనే కృష్ణ పెద్ద కొడుకు, నటుడు, మహేష్బాబు సోదరుడైన రమేష్ బాబు కన్నుమూశారు. జనవరి 8వ తేదీన రమేష్బాబు అనారోగ్యంతో మరణించడం.. ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. తాము ఉండగానే కొడుకు కన్నుమూయడాన్ని తట్టుకోలేకపోయారు కృష్ణ-ఇందిరాదేవి. రమేష్ బాబు మరణం ఆ కుటుంబానికి పెద్ద షాకే ఇచ్చింది. ఇక అన్నను పోగొట్టుకున్న మహేశ్ బాబు ఆ బాధ నుంచి కోలుకునే లోపే ఆయన తల్లి ఇందిరా దేవి చనిపోయారు. సెప్టెంబర్ 28న అనారోగ్యంతో ఇంటి వద్దే కన్నుమూశారు. ఆ బాధ నుంచి తేరుకోకముందే ఇప్పడు కృష్ణ మరణం ఆ కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టేసింది. ముఖ్యంగా మహేష్ బాబుకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఇలా ఏడాది వ్యవధిలోనే మహేష్ బాబు ఇంట వరుసగా ముగ్గురు మృతి చెందడంతో.. ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.