నటుడు మాధవన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. ఆయన సినిమాలకు ప్రేక్షకులలో మంచి ఆదరణ ఉంటుంది. మాధవన్ ఇటీవలి కాలంలో తండ్రిగా గర్వపడుతున్నాడు. తన కొడుకు స్విమ్మింగ్ పోటీల్లో అదరగొడుతుండగా, ఆ విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఫుల్ ఖుష్ అవుతున్నాడు.
మాధన్ తనయుడు వేదాంత్ తాజాగా ఏడు పతకాల్ని కొల్లగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. బెంగళూరులోని బసవనగుడి అక్వాటిక్ సెంటర్ లో జూనియర్ నేషనల్ స్విమ్మింగ్ అక్వాటిక్ చాంపియన్ షిప్ 2021 పోటీల్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పదహారేళ్ల వేదాంత్ ఏకంగా ఏడు మెడళ్లను సొంతం చేసుకున్నాడు. 800 మీటర్ల ప్రీస్టైల్.. 1500 మీటర్ల ప్రీస్టైల్.. 4×100 ఫ్రీస్టైల్ రిలే 4×200 ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్లలో రజత పతకాలు.. 100 200 400 మీటర్ల ఫ్రీస్టైల్ పోటీల్లో కాంస్య పతకాలు ఉన్నాయి. ఏడు పతకాల్ని సాధించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ ట్వీట్ చేస్తూ.. ‘‘గుడ్ జాబ్ వేదాంత్. మీ ప్రదర్శన పట్ల గర్విస్తున్నాం’’ అని పేర్కొన్నారు.