యువ కథానాయకుడు నితిన్ హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఆయన ఇటీవల నటించిన చెక్, రంగ్ దే చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇక సెప్టెంబర్ 17న మ్యాస్ట్రో చిత్రంతో పలకరించబోతున్నాడు. ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుండగా, ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఆ చిత్రం ప్రమోషన్ పనుల్లో ఓపక్క బిజీగా వున్న నితిన్.. వినాయక పండుగ రోజున మరో కొత్త చిత్రాన్ని హైదరాబాదులో ప్రారంభించాడు.
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వద్ద పలు సినిమాలకు పనిచేసిన ఎస్.ఆర్.శేఖర్ అనే కుర్రాడు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో కథానాయికగా కృతి శెట్టి నటిస్తుంది. నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు షాట్ ను హీరోహీరోయిన్లపై చిత్రీకరించారు. దీనికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేసి, క్లాప్ కొట్టారు.
నితిన్ 31వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి మాచర్ల నియోజకవర్గం అనే టైటిల్ ఫిక్స్ చేసి మోషన్ పోస్టర్ విడుదల చేశారు.ఇది చూస్తుంటే ఒక ఊరికి సంబంధించిన కథ నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నట్టు అర్ధమవుతుంది.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్రాన్ని రూపొందించనున్నారు.