నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. కృతి శెట్టి, కేథరీన్ ట్రెసా నాయికలుగా నటిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నది. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఎం.ఎస్ రాజశేఖర్రెడ్డి దర్శకుడు. ఆగస్టు 12న ఈ సినిమా విడుదలకానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి ఆడిపాడిన ‘రా రా రెడ్డి..’ పాటను నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.
ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ..‘డ్యాన్స్ ఎక్కువగా ఉండే పాటలు చేయమని అభిమానులు కోరుతుంటారు. వారి కోసమే ఈ చిత్రంలో ‘రా రా రెడ్డి ’ పాటను రూపొందించాం. మహతి స్వరసాగర్ కంపోజిషన్, జానీ మాస్టర్ స్టెప్పులు, కాసర్ల శ్యామ్ సాహిత్యం ఆకట్టుకుంటాయి. ఈ పాటలో ‘జయం ’ సినిమాలోని ‘రాను రాను అంటూనే సిన్నదో’ పాట బిట్ ఉంటుంది. అంజలి డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి’ అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..‘జయం’ సినిమాతో ఇరవై ఏళ్ల కిందట నితిన్ ప్రయాణం మొదలైంది.
మన దగ్గర హీరోలు ఎక్కువ. వాళ్లందరితో పోటీని తట్టుకుంటూ ఇంత సుదీర్ఘ ప్రయాణం చేయడం మామూలు విషయం కాదు. ఈ సినిమా ఆయనకు మరో హిట్ ఇవ్వాలి’ అన్నారు. “రా రా రెడి’్డ పాట నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ పాటలో డ్యాన్సులు చేయడాన్ని ఆస్వాదించాను. పాట చివరలో రాను రాను అంటూనే పాట బిట్ రావడం జోష్ నింపింది’ అని నాయిక అంజలి చెప్పింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి, దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి, నాయిక కృతి శెట్టి, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్, ఆదిత్య మ్యూజిక్ ఎండీ ఉమేష్ గుప్తా, గీత రచయిత కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.