మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ జంటగా దర్శకుడు సుకు పూర్వాజ్ రూపొందించిన సినిమా ‘మాటరాని మౌనమిది’. రుద్ర పిక్చర్స్, పీసీఆర్ గ్రూప్ సంస్థలు కలిసి నిర్మించాయి. థ్రిల్లింగ్ లవ్స్టోరితో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ..‘మనం సినిమాల్లో ఫిక్షన్, థ్రిల్లర్, హారర్ ఇలా ఏదో ఒక తరహా కథను చూస్తుంటాం. ఈ చిత్రంలో అలాంటి అంశాలను కలిపి మల్టీజానర్ మూవీగా రూపొందించాం. గతంలో నాకు ఇలాంటి కథలతో షార్ట్ ఫిలింస్ చేసిన అనుభవం ఉంది. రెండు ప్రేమ కథలతో సినిమా సాగుతుంది. కథలో వినోదానికి లోటుండదు. ప్రివ్యూ చూసిన వాళ్లంతా సినిమా బాగుందని చెబుతున్నారు. మాకూ సినిమా మీద మంచి నమ్మకం ఉంది. ఇందులో రెండు ప్రధాన పాత్రలకు మాటలు రావు. వారికి అనుకోని పరిస్థితి ఎదురైతే ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. కథలోని ఐదారు మలుపులు ఆకట్టుకుంటాయి. వీటికి ఒక శాస్త్రీయ అంశంతో సంబంధం ఉంటుంది. నాకు థ్రిల్లర్ మూవీస్ చేయడం అంటే ఇష్టం. త్వరలో మాఫియా, యాక్షన్ నేపథ్యాలతో సినిమాలు రూపొందించాలని అనుకుంటున్నా’ అన్నారు.