దక్షిణాదిన అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్. కమర్షియల్ చిత్రాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ కథాంశాల్లో తనదైన అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది. ఇటీవల విడుదలైన ‘దసరా’ చిత్రంలో ఈ భామ పోషించిన వెన్నెల పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. తాజాగా కీర్తి సురేష్ రాజకీయ అరంగేట్రం గురించి తమిళ సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది. ఉదయనిధి స్టాలిన్ సరసన కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం ‘మామన్నన్’ ఈ నెల 29న విడుదలకానుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న కీర్తి సురేష్ రాజకీయాల గురించి చేసిన కామెంట్స్ హాట్టాపిక్గా మారాయి. ‘మామన్నన్’ రాజకీయ నేపథ్య కథాంశమని, ఇందులో తన పాత్ర చాలా సీరియస్గా ఉంటుందని ఆమె పేర్కొంది. సమీప భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ‘నా రాజకీయ ప్రవేశం గురించి చాలా మంది అడుగుతున్నారు. ఈ విషయం గురించి ఓసారి ఆలోచించాలి’ అని బదులిచ్చింది. దీంతో ఆమెకు రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయని, రాబోవు రోజుల్లో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని తమిళ చిత్రసీమలో ప్రచారం జరుగుతున్నది. గతంలోనూ కీర్తి సురేష్ రాజకీయ ప్రవేశంపై వదంతులు వినిపించగా వాటిని ఆమె తల్లి మేనక ఖండించింది. సినిమాలు తప్ప తన కూతురికి ఏ రంగంలోనూ ఆసక్తి లేదని స్పష్టం చేసింది.