Maa Inti Bangaram | స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ వసూళ్లు రాబట్టింది. సినిమా సాధించిన ఈ విజయోత్సాహంలో చిత్ర బృందం వైజాగ్లో గ్రాండ్ సక్సెస్ మీట్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ‘మా ఇంటి బంగారం’ సీక్వెల్పై వచ్చిన అధికారిక ప్రకటన. చిత్ర రచయిత, సమంత భర్త రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. ప్రేక్షకుల స్పందన చూసి తాము ఎంతో ఆనందంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రేక్షకులను ఉద్దేశించి, “మా ఇంటి బంగారం పార్ట్-2 వస్తే చూస్తారా?” అని ప్రశ్నించారు. వెంటనే సభా ప్రాంగణం మొత్తం చప్పట్లతో, కేరింతలతో మార్మోగిపోయింది.
అభిమానుల నుంచి వచ్చిన ఈ భారీ స్పందనతో రాజ్ నిడిమోరు ‘మా ఇంటి బంగారం 2’ను అధికారికంగా ప్రకటించారు. “ఇప్పటికే నా మైండ్లో సీక్వెల్కు సంబంధించిన ఓ అద్భుతమైన ఐడియా ఉంది. మరో రెండేళ్లలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. ఇదే టీమ్తో పార్ట్-2 రూపొందుతుంది” అని ఆయన వెల్లడించారు. సాధారణంగా ఒక సినిమా పూర్తయ్యాక దానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని, కానీ ‘మా ఇంటి బంగారం’ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని రాజ్ చెప్పారు. ఈ కథలో ఇంకా చెప్పాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రేక్షకులు ఈ పాత్రలను ఎంతో ప్రేమించారు. అందుకే ఈ కథను మరింత పెద్ద స్థాయిలో కొనసాగించాలని అనిపించింది. ఒక సినిమాకు పార్ట్-2 చేయాలనే ఇన్స్పిరేషన్ నాకు కలగడం ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు.
పార్ట్-2లో మరిన్ని ఆసక్తికరమైన పాత్రలు, కొత్త ట్విస్టులు ఉండబోతున్నాయని రాజ్ నిడిమోరు సంకేతాలు ఇచ్చారు. మా ఇంటి బంగారం 2 డబుల్ ఫన్, డబుల్ ఎక్సైట్మెంట్తో ఉంటుంది. మొదటి భాగాన్ని మించిన వినోదాన్ని అందించేలా కథను సిద్ధం చేస్తున్నాం అని ఆయన చెప్పారు. ‘మా ఇంటి బంగారం’ విజయంతో ఇప్పటికే సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు ఇప్పుడు సీక్వెల్ ప్రకటన మరింత ఆనందాన్ని ఇచ్చింది. సోషల్ మీడియాలో ‘మా ఇంటి బంగారం 2’ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మరోసారి సమంత-నందిని రెడ్డి-రాజ్ నిడిమోరు కాంబినేషన్ మ్యాజిక్ చూడబోతున్నామంటూ అభిమానులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారిక ప్రకటన రావడంతో ‘మా ఇంటి బంగారం 2’పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాబోయే రెండేళ్లలో ఈ సీక్వెల్ ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.