మోహన్బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘జయజయ మహావీర’ అనే పల్లవితో సాగే తొలి లిరికల్ వీడియోను బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్బచ్చన్ మంగళవారం ట్విట్టర్ ద్వారా విడుదలచేశారు. ఈ గీతానికి ఇళయరాజా సంగీతాన్ని అందించగా, రాహుల్ నంబియార్ ఆలపించారు. ‘భారతీయ సినీ చరిత్రలో దిగ్గజాలైన మోహన్బాబు, సంగీత దర్శకుడు ఇళయరాజా సంయుక్తంగా శ్రీరాముడి ధైర్యసాహసాలు, కీర్తిప్రతిష్టలను స్తుతిస్తూ రఘువీరగద్యాన్ని ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాలో అద్భుతంగా ఆవిష్కృతం చేశారు’ అని అమితాబ్బచ్చన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మంచు విష్ణు మాట్లాడుతూ ‘దేశభక్తి ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మోహన్బాబు శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారు. ఇటీవలే చిరంజీవి వ్యాఖ్యానంతో విడుదలైన టీజర్కు సామాజిక మాధ్యమాల్లో చక్కటి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం’ అని తెలిపారు.