సినీ రంగాన్ని ఇంతగా ఇబ్బందులు పెట్టడం తన సుదీర్ఘ అనుభవంలో ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేసింది దిగ్గజ నటి ఆశా పారేఖ్. చిత్రరంగంపై వివక్షాపూరితంగా వ్యవహరించడం సరికాదని ఆమె అన్నారు. ఇటీవల షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాలోని పాట విషయంలో చెలరేగిన వివాదాల దృష్ట్యా ఆశా పారేఖ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ…‘గత కొద్ది కాలంగా సినీ పరిశ్రమపై బయటి శక్తుల ఒత్తిడి పెరిగింది. సినిమాల విషయంలో కొందరు అనవసర వివాదాలు రేపుతున్నారు.
కొద్దిమంది అభ్యంతరాలను దేశానికంతటికీ ఆపాదిస్తున్నారు. ఒక సినిమా విడుదలైతే నచ్చిన వారు చూస్తారు, నచ్చని వారు వదిలేస్తారు. ‘పఠాన్’ సినిమాలోని పాట నచ్చకుంటే కనీసం ఆ పాటను తొలగించి సినిమాను సజావుగా విడుదల చేయనివ్వడం మంచిది. ఎందుకంటే ఇప్పటికే వరుస అపజయాలు చూస్తున్న నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ మరో ఫ్లాప్ తట్టుకోలేదు’ అని చెప్పింది. బాలీవుడ్లో దశాబ్దాల పాటు అగ్రతారగా వెలిగిన ఆశా పారేఖ్ గతేడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంది.