లాక్డౌన్ విరామం వల్ల తన జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పింది కథానాయిక ప్రగ్యాజైస్వాల్. ఏకాంతంగా గడపడం వల్ల తనలోని శక్తిసామార్థ్యాల్ని బేరీజు వేసుకునే అవకాశం దొరికిందని తెలిపింది. వృత్తిపరమైన ఆశలు, ఆకాంక్షల్ని పక్కనబెట్టి వర్తమానంలో జీవించడం ఎలాగో నేర్చుకున్నానని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘లాక్డౌన్ వల్ల ఒక్కసారిగా జీవితంలో వేగం మందగించింది. పరుగు ఆపి ఏది మనకు ముఖ్యమో విశ్లేషించుకునే అరుదైన అవకాశం దక్కింది. వర్కవుట్స్ మీద పూర్తిగా దృష్టిపెట్టడంతో పాజిటివ్ దృక్పథం అలవడింది. ఇప్పుడు నేను గతంలో కంటే ఎంతో సంతోషంగా ఉన్నా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ సుందరి బాలకృష్ణ సరసన ‘అఖండ’ సినిమాలో నటిస్తోంది. హైదరాబాద్లో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలో ప్రగ్యాజైస్వాల్ పాల్గొంటున్నది. ఈ సినిమాలో తన పాత్ర కేవలం గ్లామర్కే పరిమితం కాదని, కథాపరంగా అభినయానికి ఎంతో ప్రాధానత్య ఉంటుందని ఆమె చెప్పింది.