‘ఆహా’ ఓటీటీలో ప్రసారమైన సంగీత ప్రధాన రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్-2’ సీజన్ ముగింపు వేడుకకు అగ్ర హీరో అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టైటిల్ కోసం 12 మంది పోటీపడగా విశాఖపట్నంకు చెందిన సౌజన్య భాగవతుల విజేతగా నిలిచింది. ఫస్ట్ రన్నరప్గా హైదరాబాద్కు చెందిన జయరాం, సెకండ్ రన్నరప్గా సిద్ధిపేటకు చెందిన లాస్యప్రియ నిలిచారు. సంగీత దర్శకుడు తమన్, సింగర్స్ కార్తీక్, గీతా మాధురి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. విజేతను ప్రకటించిన అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమం చూస్తుంటే సంగీతంపై మరింత ప్రేమ పెరిగింది. ఇదొక మరచిపోలేని జ్ఞాపకంలా మిగిలిపోతుంది. రెండేళ్ల పాపకు తల్లిగా ఉంటూ సౌజన్య ఈ పోటీలో నెగ్గడం చాలా గొప్ప విషయం. పళ్లైన ప్రతీ స్త్రీకి భర్త సహకారం అందించాలి. అప్పుడే మహిళలు అనుకున్న లక్ష్యాల్ని సాధిస్తారు’ అన్నారు.
లాస్యప్రియను అభినందించిన మంత్రి హరీశ్ రావు
ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ నిర్వహించిన ఇండియన్ ఐడల్ సీజన్-2లో సిద్ధిపేటకు చెందిన గుమ్మనగారి లాస్యప్రియ సెకండ్ రన్నరప్గా నిలిచారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు. ‘ఇండియన్ ఐడల్ తెలుగు -2023 సింగింగ్ కాంపిటీషన్లో రన్నరప్గా నిలిచిన సిద్ధిపేట ముద్దుబిడ్డ లాస్య ప్రియకు హృదయ పూర్వక అభినందనలు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిషరించిన గాయకులందరికి గొప్ప భవిష్యత్ ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. పోటీ ప్రారంభమైనప్పటి నుంచి లాస్యప్రియ ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఈ క్రమంలో మంత్రి హరీశ్ రావు గతంలోనే లాస్యప్రియకు తన ఆశీస్సులు అందించారు. ఈ స్ఫూర్తితో పట్టుదలగా పోటీలో నిలిచి, ఫైనల్కు చేరి రెండవ రన్నరప్గా నిలిచారు.