కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(Puneet Raj Kumar) అక్టోబర్ 29న గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం అభిమానులకి పీడ కలగా మారింది. మృతిని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము అభిమానించిన వ్యక్తి తిరిగి రాడని తెలిసిన దగ్గరనుంచి అందరి హృదయాలు ద్రవించిపోతున్నాయి. నటుడిగానే కాకుండా మంచి మానవతావాదిగా ఎందరో మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు పునీత్ రాజ్ కుమార్.
పునీత్ మరణించిన తర్వాత ఆయన పార్ధీవ దేహాన్ని అభిమానుల సందర్శనార్ధం కంఠీరవ స్టేడియంలో ఉంచారు. రెండు రోజులుగా లక్షలాది మంది అభిమానుల సందర్శన అనంతరం ఆదివారం తెల్లవారు జామున అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రత్యేకించి సాంప్రదాయం ప్రకారం కొంతమంది స్వామీజీలు ప్రత్యేక పూజలు నిర్వహించి అత్యంత శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
అయితే పునీత్ని కడసారి చూసేందుకు మొత్తంగా 10 లక్షలకు మంది పైగా ప్రజలు హాజరైనట్టు తెలుస్తుంది. ఇందులో అభిమానులు, ప్రముఖులు ఉన్నారు. ఆయన తండ్రి రాజ్ కుమార్ చనిపోయినప్పుడు రెండు లక్షల వరకు హాజరైనట్టు తెలుస్తుంది. కాగా, పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే రాఘవేంద్ర రాజ్ కుమార్ తనయుడు వినయ్ రాజ్ కుమార్ చేతులమీదుగా అంత్యక్రియలు పూర్తి చేశారు.