‘ ‘కుబేర’ పూర్తిగా శేఖర్ కమ్ముల ఫిల్మ్. మేమంతా పాత్రలం మాత్రమే. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి శేఖర్ చేసిన సినిమా ఇది. ఈ సినిమాతో మా ఆర్టిస్టులందరి ఆకలి తీర్చేశారు శేఖర్ కమ్ముల. సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం.’ అని అక్కినేని నాగార్జున అన్నారు. ఆయన ప్రత్యేక పాత్రలో ధనుష్ హీరోగా రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’. రష్మిక మందన్నా కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, రామ్మోహన్ పుస్కూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో నాగార్జున మాట్లాడారు. ఈ సినిమా కథ గురించి తెలిసి షాకయ్యానని, రిచ్ ప్రపంచాన్నీ, పూర్ ప్రపంచాన్ని ఈ కథలో శేఖర్ ఎలా కలిపారో చూడాలని తానూ ఎదురుచూస్తున్నానని అతిథిగా విచ్చేసిన ఎస్.ఎస్.రాజమౌళి తెలిపారు.
ధనుష్ మాట్లాడుతూ ‘ ‘కుబేర’ కోసం శేఖర్ కమ్ముల చాలా కష్టపడ్డారు. ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయలేదు. ఆయనతో పని చేయడం ప్రౌడ్గా ఫీలవుతున్నా. ‘సార్’ తర్వాత నేను చేసిన తెలుగు సినిమా ఇది. నా కెరీర్కి ‘కుబేర’ నిజంగా స్పెషల్.’ అని చెప్పారు. “కుబేర’ నాకు తల్లిలాంటి సినిమా. బిచ్చగాడైనా కోటీశ్వరుడైనా తల్లిప్రేమ ఒక్కటే. ఆ ఎమోషన్తోనే ఈ సినిమా తీశాను. దర్శకుడయ్యే ముందు సరస్వతీదేవి తలదించుకునేలా సినిమాలు చేయకూడదని ప్రామిస్ చేసుకున్నా. ఈ సినిమా సరస్వతి తల ఎత్తుకునేలా ఉంటుంది. నిజంగా కొత్త సినిమా. అన్ని ఎమోషన్సూ ఉన్న నిజమైన పాన్ ఇండియా సినిమా ఇది. మీరు డెఫినెట్గా గొప్ప సినిమా చూడబోతున్నారు.’ అని శేఖర్ కమ్ముల నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా కథానాయిక రష్మిక మందన్నాతోపాటు నిర్మాతలు సునీల్ నారంగ్, రామ్మోహన్ పుస్కూర్, తోట తరణి, దేవిశ్రీ ప్రసాద్, జాన్వీ నారంగ్ కూడా మాట్లాడారు.