నేడు అసెంబ్లీలో ఫిట్మెంట్ ప్రకటించనున్న సీఎం కేసీఆర్
రిటైర్మెంట్ వయసు పెంపుపైనా నిర్ణయం
ఉద్యోగ సంఘాల నేతలతో కేసీఆర్ భేటీ
ఏపీ కన్నా ఎక్కువే వస్తుందన్న ఆశలు!
ఒకటిరెండు రోజుల్లో సానుకూల ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్న సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పీఆర్సీ ప్రకటన వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రకటించాలని భావించినా.. అప్పుడే నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదలచేసింది. దీంతో మళ్లీ ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది. పీఆర్సీ ప్రకటనకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థిస్తూ లేఖ రాసింది.
దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం పీఆర్సీ ప్రకటనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఫిట్మెంట్ ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. వేతన సవరణ (పీఆర్సీ) ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం పీఆర్సీపై ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్వయంగా అసెంబ్లీలో ప్రకటన చేస్తారని తెలిసింది. రిటైర్మెంట్ వయసు పెంపుపైనా నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం ఉన్నది. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినదానికన్నా ఎక్కువే వచ్చే అవకాశం ఉన్నదని ఉద్యోగ వర్గాలు ఆనందపడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం కావడం, సుదీర్ఘంగా చర్చలు జరుపడం ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం ప్రకటనపై ఉద్యోగుల ధీమా
పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వం కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నా.. ఎన్నికల నేపథ్యంలో నిబంధనల కారణంగా వాయిదా పడుతున్నది. పీఆర్సీ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో దశల వారీగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అనంతరం తుది నివేదిక సీఎం కేసీఆర్ వద్దకు చేరింది. సీఎం ఉద్యోగుల పక్షపాతి అని.. తాము ఏం కోరుకుంటున్నామో తెలిసిన వ్యక్తి అని, ఒకటిరెండు రోజుల్లో సానుకూల ప్రకటన వస్తుందని ఉద్యోగులు ధీమాగా ఉన్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పీఆర్సీ ప్రకటన వాయిదా పడింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రకటించాలని భావించినా.. వెంటనే నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదలచేసింది. దీంతో మరోసారి ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది. పీఆర్సీ ప్రకటనకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించింది. ఈ మేరకు శనివారం లేఖ రాసింది. దీనిపై ఎన్నికల సంఘం ఆదివారం స్పందించింది. పీఆర్సీ ప్రకటనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేసింది. అయితే ఈ అంశాన్ని ఉపయోగించుకొని ఉపఎన్నిక జరుగుతున్న జిల్లాలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు, లబ్ధి పొందే ప్రయత్నాలు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పీఆర్సీ ప్రకటనకు మార్గం సుగమమైంది.
సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీ
ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆదివారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకోవడం పట్ల వారు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పీఆర్సీపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. దీంతోపాటు పదవీ విరమణ వయసు పెంపు, ఇతర అంశాలను కూడా చర్చించినట్టు తెలిసింది.
సంబురంలో ఉద్యోగులు
పీఆర్సీ ప్రకటనకు అడ్డంకులు తొలిగిపోవడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఉద్యోగులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. కానీ ఈసీ సానుకూలంగా స్పందించడం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఎక్కువగానే పీఆర్సీ వస్తుందన్న అంచనాలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వారిలో ఆనందాన్ని పెంచుతున్నాయి. పీఆర్సీ కమిషన్ చేసిన సూచనకు ప్రభుత్వం సుమారు నాలుగు రెట్లు ఎక్కువగా పెంచవచ్చని వారు భావిస్తున్నారు. పదవీ విరమణ వయసు పెంపుపై కూడా ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు ఉద్యోగుల నాడి, వారి సమస్యలు తెలుసునని, పీఆర్సీ ఆశించిన ఇస్తారన్న నమ్మకం ఉందని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మార్త రమేశ్ ఆశాభావం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ కచ్చితంగా సానుకూల నిర్ణయం తీసుకుంటారని, ఆయనను ప్రకటనను స్వాగతిస్తామని టీజీవో హైదరాబాద్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తెలిపారు.
సాకారమవుతున్న ఏండ్లనాటి కల
మంత్రులు మహమూద్ అలీ, గంగులకు సీపీఎస్ ఉద్యోగుల ధన్యవాదాలు
సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదన్న వార్తల నేపథ్యంలో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ నేతృత్వంలోని బృందం ఆదివారం హోం మంత్రి మహమూద్ అలీ, బీసీశాఖ మంత్రి గంగుల కమలాకర్ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం పట్ల అభినందనలు తెలిపింది. రెండు నియోజకవర్గాల పరిధిలోని సుమారు 1.50 లక్షలమంది ఉద్యోగులు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియమితులైన సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఫ్యామిలీ పెన్షన్ ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని తెలుస్తున్నదన్నారు. ఆయన ఉద్యోగుల పక్షపాతి అని మరోసారి నిరూపితం అయ్యిందన్నారు. తమ ఏండ్లనాటి కల సాకారం అవుతున్నదని సంతోషం వ్యక్తంచేశారు.