మంగళూరు సోయగం కృతిశెట్టికి అవకాశాలైతే వస్తున్నాయి కానీ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ‘ఉప్పెన’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం అదిరిపోయినప్పటికీ..ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. దాంతో కెరీర్లో మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నది కృతిశెట్టి. ఈ నేపథ్యంలో ఆమె తమిళంలో దళపతి విజయ్ సరసన నటించే బంపరాఫర్ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వెంకట్ప్రభు దర్శకత్వంలో విజయ్ ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటుందట. ఓ నాయికగా కృతిశెట్టిని ఎంపిక చేసినట్లు తెలిసింది. వెంకట్ప్రభు దర్శకత్వం వహించిన ‘కస్టడీ’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందులో కృతిశెట్టి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో విజయ్ చిత్రంలో కృతిశెట్టిని కథానాయికగా ఖరారు చేశారని అంటున్నారు. కృతిశెట్టి కెరీర్లోనే ఇదొక అపూర్వ అవకాశమని ఆమె అభిమానులు సంతోషం వ్యకం చేస్తున్నారు.