సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్గా ఉంటుంది బాలీవుడ్ నాయిక కృతిసనన్. జయాపజయాలకు అతీతంగా గత కొన్నేళ్లుగా చాలెంజింగ్ రోల్స్కి ప్రాధాన్యం ఇస్తున్నది. తాజాగా ఈ భామ బాలీవుడ్లో మరో భారీ చిత్రంలో నాయికగా నటిస్తున్నదని తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ధనుష్ కథానాయకుడిగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన ‘రాన్జనా’ (2013) చిత్రం హృద్యమైన ప్రేమకథగా ఆకట్టుకుంది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో ‘తేరే ఇష్క్ మే’ పేరుతో మరో లవ్స్టోరీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయాన్ని ఇప్పటివరకూ వెల్లడించలేదు. ఆదివారం సినిమా టీజర్ను విడుదల చేశారు. ఇందులో బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఓ మహిళ వాయిస్ను బట్టి అది కృతిసనన్దేనని అభిమానులు నిర్ధారణకు వచ్చారు. దాంతో ఈ సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తున్నదని సోషల్మీడియాలో ప్రచారం మొదలైంది. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు.