ఓ సినిమాకు సంబంధించిన పారితోషికాల్లో సింహభాగం హీరోకే దక్కుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుల రెమ్యునరేషన్స్ ముప్పై కోట్లు మొదలు వందకోట్ల వరకు ఉంటాయి. అదే హీరోయిన్స్ అందుకునే పారితోషికం పదికోట్లకు మించదు. ఈ ధోరణిలో మార్పు రావాలని అంటోంది కృతిసనన్. ఇటీవలే విడుదలైన ‘మిమి’ చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సుందరి బాలీవుడ్లో పారితోషికాల పరంగా ఉన్న వివక్షపై గళం విప్పింది. కథాపరంగా సినిమాను తమ భుజస్కంధాలపై మోస్తామనే భావనలో హీరోలు ఉంటారు కాబట్టే వారికి అత్యధిక పారితోషికాలు అందుతున్నాయని చెప్పింది. నాయికలు కేవలం గ్లామర్ హంగులకు పరిమితమైపోకుండా హీరోలతో సమానంగా బలమైన పాత్రల్ని ఎంచుకున్నప్పుడే కోరుకున్న పారితోషికాన్ని డిమాండ్ చేయొచ్చని సూచించింది.
ఆమె మాట్లాడుతూ ‘కథానాయిక ప్రధానమైన సినిమాలకు లేడీ ఓరియెంటెడ్ అనే ముద్రను వేస్తున్నారు. ఈ విభజన వల్ల మహిళా ప్రధాన చిత్రాలు ప్రత్యేకమైన కేటగిరి అనే భావన నెలకొంది. కథ, బడ్జెట్పరంగానే సినిమాను జడ్జ్ చేయాలి. అప్పుడే హీరోయిన్ల్లకు న్యాయం జరుగుతుంది’ అని చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో దీపికాపడుకోన్, అనుష్కశర్మ, విద్యాబాలన్ వంటి అగ్ర కథానాయికలు హీరోలతో సమానంగా పారితోషికం అందుకోవడం శుభపరిణామమని కృతిసనన్ పేర్కొంది. బాలీవుడ్లో పురుషాధీక్య భావజాలం తగ్గినప్పుడే పారితోషికంలో వివక్ష పోతుందని ఆమె అభిప్రాయపడింది. అయితే అందుకు చాలా సమయం పడుతుందని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం కృతిసనన్ బాలీవుడ్లో ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’ చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది.