Kriti Sanon | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటించిన ఓ రక్షా బంధన్ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. యాడ్లో కృతి ధరించిన దుస్తులపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ సంస్కృతి, రాఖీ పండుగ పవిత్రత వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదంపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తరచూ సామాజిక అంశాలపై స్పందించే గాయని చిన్మయి శ్రీపాద తనదైన శైలిలో స్పందించారు. కృతి సనన్ యాడ్పై విమర్శలు చేస్తున్న వారిని ప్రశ్నిస్తూ, మరోవైపు అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు వరుసగా పెరోల్ లభిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
ఒక మహిళ దుస్తులు, ఓ వాణిజ్య ప్రకటనను ‘సంస్కృతి’ పేరుతో విమర్శించే వారు.. తీవ్రమైన నేరానికి పాల్పడి శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి పదేపదే పెరోల్ లభిస్తున్న అంశంపై ఎందుకు అదే స్థాయిలో స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. చిన్మయి తన పోస్టులో అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి వరుసగా పెరోల్స్ లభించడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఒకవైపు మహిళల దుస్తులపై నీతులు చెప్పే సమాజం, మరోవైపు తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తుల విషయంలో భిన్నమైన వైఖరిని ప్రదర్శించడం ఏ విధమైన న్యాయమని ఆమె ప్రశ్నించారు.
చిన్మయి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. కొందరు చిన్మయి ప్రశ్నలోని సామాజిక కోణాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం రాఖీ ప్రకటన వివాదాన్ని మరో అంశంతో పోల్చడం సరైంది కాదంటూ అభిప్రాయపడుతున్నారు. కాగా, రక్షా బంధన్ సందర్భంగా రూపొందించిన ఈ ప్రకటనలో కృతి సనన్ కనిపించిన తీరు కొందరు నెటిజన్లకు నచ్చలేదు. ఆమె దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. రాఖీ వంటి సోదరసోదరీమణుల అనుబంధానికి సంబంధించిన పండుగను ఉద్దేశించిన ప్రకటనలో ఇలాంటి దుస్తులను ఎలా ఉపయోగిస్తారంటూ కొందరు ప్రశ్నించారు. మరికొందరు దీనిని భారతీయ సంప్రదాయాలు, సంస్కృతికి విరుద్ధంగా ఉందంటూ కామెంట్లు చేశారు. దీంతో కృతి సనన్ రాఖీ యాడ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.