‘సినీ రంగంలో ఏడాది ప్రయాణాన్ని పూర్తిచేసుకున్నా. తక్కువ సమయంలోనే వరుస సినిమా అవకాశాల్ని సొంతం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. నటనను ఎంతగానో ప్రేమిస్తాను కాబట్టి..ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది. ఎప్పుడెప్పుడు సెట్కు వెళ్దామా అని ఆతృతగా ఎదురుచూస్తుంటా’ అని చెప్పింది కృతిశెట్టి. ఆమె నితిన్ సరసన కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా శనివారం కృతిశెట్టి పాత్రికేయులతో మాట్లాడుతూ ‘ కథల విషయంలో నా అంతరాత్మ చెప్పిందే వింటాను. సింగిల్ సిట్టింగ్లోనే దాదాపుగా ఓకే చేస్తాను. ఎలాంటి కథ అయినా ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలని, చక్కటి అనుభూతినందించాలని కోరుకుంటా. సినిమా ఫలితం గురించి పెద్దగా ఆలోచించను. ఏం జరిగినా ఓ అనుభవంగా తీసకుంటాను. ‘మాచర్ల నియోజకవర్గం’లో నేను స్వాతి అనే అమాకమైన అమ్మాయి పాత్రలో కనిపిస్తా. తనది స్వచ్ఛమైన హృదయం. చేసే పనుల్లో కూడా అదే వ్యక్తిత్వం కనిపిస్తుంది. కథాగమనంలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.
ఇక బాలీవుడ్లో సినిమాలు చేసే ఆలోచన లేదు. తెలుగు, తమిళంలో మంచి అవకాశాలొస్తున్నాయి. చిన్నప్పటి నుంచి నాకో కల ఉంది. స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవ చేయాలని ఉంది. భవిష్యత్తులో తప్పకుండా ఆ కలను సాకారం చేసుకుంటా. కాలేజీ రోజుల్లో ఫ్రెండ్షిప్డేను బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. నా జీవితంలో అమ్మను బెస్ట్ ఫ్రెండ్గా భావిస్తా. కెరీర్ మొదలుకొని పర్సనల్ విషయాల వరకు ప్రతి అంశంలో అమ్మ నాకు సలహాలిస్తుంది’ అని చెప్పింది.